Wednesday, July 13, 2011

స్టూడెంట్స్ ...... శాస్త్రవేత్తలయ్యారు

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే అవి శరవేగంగా పెరుగుతున్న మన అవసరాలతో పోటీ పడలేకపోతున్నాయి. అందుకే విద్యార్థులు రంగంలోకి దిగారు. పరిశోధనల ద్వారా సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలని సంకల్పించారు. పట్టుదలతో ముందుకు కదిలారు. చదువుకోవడంతో పాటు వివిధ ప్రాజెక్టులపై పరిశోధనలు చేశారు. పలు కొత్త అంశాలను కనుగొని శాస్త్రవేత్తలతో పాటు ప్రజల మన్ననలు పొందారు. అలా అద్భుతాలు చేసిన బెంగళూరు, మంగుళూరు, కాన్పూర్ విద్యార్థుల సరికొత్త ప్రయోగాల గురించి తెలుసుకుందాం రండి.

డీజిల్‌తో నడిచే బైక్
 
దేశంలో రోజురోజుకు చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఫలితంగా వాహన చోదకుల ఖర్చు తడిసిమోపెడు అవుతున్నది. డీజిల్ కంటే పెట్రోలు ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో పెట్రోలుతో మాత్రమే నడిచే ద్విచక్రవాహన చోదకులపై మరింత భారం పడుతోంది.

లక్షలాది మంది ప్రజల బడ్జెట్‌ను ప్రభావితం చేసే ఈ ఖర్చును తగ్గిస్తే ఎంతో లాభం కదా? అని ఆలోచించారు బెంగుళూరుకు చెందిన ఎం.ఎస్. రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన నలుగురు మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు. రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన వి.వి.నవీన్, టోనీపాల్, నదీమ్ అన్వర్, సంజయ్ భూషణ్‌లు నలుగురూ నడిచే దారిలో కాదు.. కొత్తగా ఆలోచించాలి. పదిమందికీ ఉపయోగపడే పని ఏదైనా చేయాలని తపనపడుతూ ఉంటారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పెట్రోల్ ధరలు చుక్కల్ని తాకుతున్న నేపథ్యంలో లక్షలాది మందికి ఉపయోగపడే డీజిల్ బైక్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు.

ఇంధన ఆదాతోపాటు, డీజిల్‌తో నడిచేలా ఆటోమెటిక్ గేర్స్, ఆటోమెటిక్ క్లచ్‌లతో కూడిన ద్విచక్ర వాహనాన్ని కనుగొనే ప్రాజెక్టు చేపట్టారు. కెనటిక్ బ్లేజ్, బుల్లెట్ ఇంజన్‌లను తీసుకొని వాటికి మార్పులు, చేర్పులు చేసి సరికొత్త డీజిల్ బైక్‌ను రూపొందించారు. బెంగళూరు, కోయంబత్తూర్ లలోని వర్క్‌షాప్‌లలో ఈ కొత్త ఇంజిన్, గేర్‌బాక్సులను తయారు చేశారు. ఆటోమెటిక్ గేర్లు, క్లచ్‌లు తేలికగా పనిచేసేలా రూపొందించటం వల్ల ట్రాఫిక్‌లో సులువుగా డీజిల్ బైక్ నడిపేందుకు వీలు కలిగిందని మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు వి.వి.నవీన్, సంజయ్ భూషణ్‌లు చెప్పారు.

ఈ డీజిల్ ఇంజిన్ మిగతా ఇంజన్‌ల కంటే కూడా మెరుగైనదని, ఈ బైక్ లీటరు డీజిల్‌కు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని దీన్ని రూపొందించిన విద్యార్థులు టోనీపాల్, నదీమ్ అన్వర్‌లు చెప్పారు. నాలుగు నెలల పాటు పరిశోధనలు చేసి, ఎంతో కష్టపడి ఈ బైక్‌ను రూపొందించినట్లు వారు చెప్పారు. పెట్రోలుతో నడిచే బైక్‌కు కిలోమీటరుకు 1.70పైసలు ఖర్చు అవుతుందని, కాగా డీజిల్‌తో నడిచే తమ బైక్‌కు కిలోమీటరుకు నలభైపైసలే ఖర్చు అవుతుందని విద్యార్థులు లెక్కలు కట్టారు. తాము రూపొందించిన సరికొత్త డీజిల్ బైక్‌తో మధ్యతరగతి ప్రజల రవాణా ఛార్జీలు తగ్గుతాయని ఆ విద్యార్థులు చెప్పారు. మేం రూపొందించిన ఈ డీజిల్‌బైక్‌కు త్వరలో పేటెంట్ కూడా తీసుకుంటామని ఆ విద్యార్థులు ఆనందంగా చెప్పారు.

అంగారకుడి గుట్టువిప్పే రోబో!
బెంగుళూరు కుర్రాళ్లు డీజిల్‌బైక్ కనిపెడితే మంగుళూరు విద్యార్థులు ఏకంగా అంగారక గ్రహం సంగతి చూడాలనుకున్నారు. నాసా ఇచ్చిన స్ఫూర్తితో మంగళూరులోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు అంగారక గ్రహం రహస్యాలు కనుగొనేందుకు నడుం కట్టారు. మూడు నెలల పాటు శ్రమించి అంగారక గ్రహం మీద నేల ఎలా ఉంటుంది.

ఏ అకృతిలో ఉంటుంది? అక్కడ నీరు ఉందా అనే అంశాలను కనిపెట్టే రోబోను రూపొందించారు. మంగుళూరు ఇంజినీరింగ్ విద్యార్థులు సచిన్ , బాలచంద్రహెగ్డేలతోపాటు ఏడుగురు కలిసి ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. " ఓ రోజు యూట్యూబ్ చూస్తున్నాం. అందులోని నాసా వీడియో నాతోపాటు నా స్నేహితుల బృందాన్ని ఎంతో ఆకట్టుకుంది. నాసాలో చేస్తున్న పరిశోధనల్లాగా మేమెందుకు చేయకూడదు అనిపించింది. మన దేశంలోనూ అధునాతన పరిశోధనలు చేయాలి అని కృత నిశ్చయానికి వచ్చాం. నాసా వీడియో ఇచ్చిన స్ఫూర్తితో పరిశోధనలు జరిపి సరికొత్త హైటెక్ రోబోట్‌ను రూపొందించాం'' అన్నారు ఇంజినీరింగ్ విద్యార్థి సచిన్.

అంగారకుడి గుట్టు విప్పే ఈ రోబోలో ఉష్ణోగ్రత, పీడనం, లోహం, నీటితో కూడిన సెన్సార్‌లు అమర్చామని చెప్పారు ఆ విద్యార్థులు. పిన్‌హోల్ కెమెరాతో పాటు వైర్‌లెస్ నావిగేషన్, బ్యాటరీ ఛార్జింగ్ కోసం సోలార్ ప్యానల్ , 12.7 ఆంప్లీల బ్యాటరీలను ప్రత్యేకంగా రూపొందించామని విద్యార్థులు చెప్పారు. మేం రూపొందించిన హైటెక్ రోబో ఇప్పటి వరకు ఎవరూ ఛేదించని అంగారకగ్రహం రహస్యాలను ఛేదిస్తుందని ఆ విద్యార్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బడా శాస్త్రవేత్తలు సైతం సాధించలేని విజయాలను మంగుళూరు కళాశాల విద్యార్థులు సాధించడం నిజంగా అభినందనీయం. వారికి హేట్సాఫ్ చెబుదాం!

తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్తు
కాన్పూర్ ఐఐటీ విద్యార్థులు చదువుల్లోనే కాదు ప్రయోగాల్లో సైతం తమ సత్తా నిరూపించు కోవాలనుకున్నారు. ఇందుకు అధ్యాపకులు సహకారం కూడా తోడయింది. ఏం చేయాలి? అని ఆలోచించారు. తాము చదువుకొనే కళాశాలకు సమీపంలోని నాన్కారీ, బారాసిరోహీ, సింగ్‌పూర్, బకుంతపూర్, నారమావు, కచ్చర్ గ్రామాలను పరిశీలించారు. ఆ గ్రామాలను విద్యుదీకరించినా ఎప్పుడూ విద్యుత్ సరఫరా అయ్యేది కాదు. ఆ గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడడాన్ని విద్యార్థులు గ్రహించారు. నిత్యం అంధకారంలో మగ్గుతున్న ఆరు గ్రామాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు విద్యార్థులు.

కరెంట్ నిరంతర సరఫరా లేనందు వల్ల ఆ గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పడు సోలార్ విద్యుత్ అందిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. సాధారణంగా సోలర్ విద్యుత్ సరఫరాకు మామూలు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అంత ఖర్చు లేకుండా, అతి తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్ సరఫరా చేసేందుకు వాళ్లు ప్రయోగాలు ప్రారంభించారు. పరిశోధనలు చేశారు. ప్రొఫెసర్ల సహకారం తీసుకున్నారు. చివరకు ఆ విద్యార్థుల కృషి ఫలించింది. తక్కువ ఖర్చుతోనే 500 కిలోవాట్‌ల సామర్ధ్యం గల సోలార్ ప్లాంట్‌ను నెలకొల్పి ఆరుగ్రామాలకు విద్యుత్తును అందించారు.

ఈ ప్రాజెక్టుకు సైన్సు అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్ ఆర్థిక సహకారం అందించింది. "ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఆరు గ్రామాలకు సోలార్ విద్యుత్తు అందించటం పెద్ద సమస్య కాదు. కానీ మా ఐఐటీ విద్యార్థులు తమ పరిశోధనలతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు'' అన్నారు ఆ సంస్థ డైరెక్టరు ప్రొఫెసర్ సంజయ్ జి.దండే. విద్యార్థులు పంచిన వెలుగులతో ఆ ఆరు గ్రామాలు ఈ రోజున కొత్త వెలుగులు చిమ్ముతున్నాయి. సామాజిక స్పృహతో కొత్త ప్రయోగాలు చేసిన విద్యార్థులు ప్రజల జేజేలు అందుకుంటున్నారు.

No comments: